
టిబెట్ను ఆక్రమించి 65 ఏళ్లు అయిన సందర్భంగా గురువారం చైనా సంబరాలు చేసుకుంది. భారత్, భూటాన్ సరిహద్దులను ఆనుకుని టిబెట్ భూభాగంలో నిర్మించిన సరిహద్దు గ్రామాల్లో విజయోత్సవాలు జరిపింది. చైనా సేనలు 1951లో టిబెట్ను ఆక్రమించగా, 1959 మార్చి 28న దలైలామా భారత్కు తరలివెళ్లి ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి ఆ తేదీని ప్రజాస్వామ్య సంస్కరణ దినంగా చైనా జరుపుతోంది. టిబెట్ను చైనా షిజాంగ్గా వ్యవహరిస్తుంది. షిజాంగ్లో భారత్, భూటాన్ సరిహద్దుల వెంబడి నిర్మించిన గ్రామాల్లో విజయోత్సవాలు జరిగాయని చైనా అధికార వార్తా సంస్థలు తెలిపాయి. భూటాన్ సరిహద్దు వెంబడి మూడు గ్రామాల్లో స్థానికులు, సైనికుల కోసం కొత్త భవనాలు నిర్మించారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక గత నెలలో తెలిపింది. ఇవి మెరుగైన జీవన వసతులను కల్పించడంతోపాటు రక్షణ దుర్గాలుగా కూడా ఉపకరిస్తాయని వివరించింది. భారత్, భూటాన్ సరిహద్దులను ఆనుకుని ఉన్న టిబెట్ భూభాగంలో మొత్తం 624 గ్రామాలను నిర్మించినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అక్కడ నూరు శాతం బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని, 4జీ కమ్యూనికేషన్లను నెలకొల్పారు. భారత్, భూటాన్ సరిహద్దు గ్రామాల్లో మంగళవారం నుంచి గురువారం వరకు ఎనిమిది విజయోత్సవాలను నిర్వహించినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.



