
భగవద్గీతను ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉపకరిస్తే జీవితం నేపథ్యాన్ని తెలియజేస్తుందని, మానవ జీవితంలో శాంతి,ఆనందం, ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శకంగా ఉంటుందని విశాఖపట్నానికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచన కర్త, నిష్కామ ఫౌండేషన్ అధ్యక్షురాలు అరుణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విజయనగరం పట్టణంలోని కొత్తపేట మన్నార్ రాజగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 7:15 గంటల వరకు శ్రీ మన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ మద్భగవద్గీత రెండవ అధ్యాయం, సాంఖ్యయోగంపై ప్రవచించనున్నట్లు తెలిపారు. నేటి యువత భగవద్గీత గురించి తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ సతీష్ మాటూరు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కూరెళ్ల సరోజిని, రమేష్ల సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు.



