News

మొక్కలు ఒత్తిడికి గురైతే అరుస్తాయంట.. మీకు తెలుసా?

301views

మనుషులు ఒత్తిడికి గురైనప్పుడు.. కోపం వచ్చినప్పుడు.. ఇతరులపై అరవడం వంటికి మనం సాధారణంగా చూస్తుంటాం. ఇక జంతువుల్లో కూడా ఇది కామన్‌. అయితే.. మొక్కలు కూడా ఒత్తిడికి గురైనప్పుడు పెద్దగా అరుస్తాయంటండీ.. అవును మీరు చదివింది నిజమే. మొక్కలకి సరిగా నీరు లభించనప్పుడు.. ఇతర ఇబ్బందులు కలిగినప్పుడు అవి గట్టిగా అరుస్తాయంట. ఇక్కడే మీకో డౌట్‌ రావచ్చు మరి మనం ఎప్పుడూ వినలేదు కదా.. ఒకవేళ విన్నాకూడా అది గాలి వల్ల మొక్కలు చేసే శబ్ధం కదా అని అందరూ అనుకుంటారు. అయితే ఇదంతా వాస్తవమే కానీ.. మనుషులు వినలేని, గుర్తించలేని పౌనఃపుణ్యంతో మొక్కలు శబ్దాలు చేస్తాయట, అరుస్తాయట.. వాటిని మానవులు అంత సులువుగా వినలేరని దీని కోసం ప్రత్యేక పరికరాలు వినియోగించాలని సైంటిస్టులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొక్కలకు నీరు లభించనప్పుడు.. అవి మానవులు వినలేని పౌనఃపున్యంతో కూడిన ‘స్క్రీమ్’ను విడుదల చేస్తాయని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. జర్నల్ సెల్‌లో ప్రచురించిన పరిశోధనలో ప్రకారం మొక్కలు ఒత్తిడికి ప్రతిస్పందనగా గాలిలో శబ్దాలను కూడా ఉత్పత్తి చేయగలవని అందులో తెలియజేశారు. టెల్ అవీవ్ యూనివర్శిటీ నిపుణులు టొమాటో, పొగాకు మొక్కలు, ఇతర మొక్కలపై వారు పరిశోధనలు చేసి అవి శబ్దాలు చేస్తున్నట్లు గుర్తించారు. మనుషులకు ఆ శబ్దాలు వినిపించకపోయినా.. వివిధ రకాల జీవులు వాటిని వింటున్నాయని వారు గుర్తించారు. మొక్కలు ‘సెసిల్’ జీవులని అంటే.. శాకాహారంపై ఆధారపడేవని చెబుతున్నారు. అందువల్ల అవి ఒత్తిడిని తట్టుకోలేవని పరిశోధకులు చెబుతున్నారు. మొక్కల్లో జరిగే… జీవ రసాయన ప్రతిస్పందనలను పరిశీలించిన పరిశోధకులు.. వాటికి మెరుగైన కాంతి, గురుత్వాకర్షణ, ఉష్ణోగ్రత, కావాల్సిన రసాయనాలు, నీరు వంటి వాటిని పుష్కలంగా అందించి.. వాటి పెరుగుదలలో వచ్చిన అసాధారణ మార్పులను గమనించారు. ఈ శబ్ద సంకేతాలు గుర్తించి ఆయా సమస్యలను వెంటనే నివారిస్తే.. మొక్కల పెరుగుదల, పునరుత్పత్తిలో పెనుమార్పులు సంభవిస్తాయని అంటున్నారు.

మొక్కలు ఒత్తిడిని ఎదుర్కోవడానికి, నిరోధించడానికి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి ఇతర జీవులతో పరస్పరం సంబంధాలు ఏర్పరుచుకుంటాయని చెబుతున్నారు. గతంలోనూ పరిశోధకులు తేనెను ఉత్పత్తి చేసే శబ్దాలను రికార్డు చేసి.. ఏ మొక్కలు అధికంగా తేనెను ఇస్తాయి అన్నది నిర్దారించి విజయం సాధించారు. ప్రస్తుతం ఆ పరిశోధనలు చేసిన లిలాచ్ హడానీ నేతృత్వంలోని బృందం.. టమోటా మరియు పొగాకు మొక్కలు, వివిధ జాతులు మొక్కలు గాలిలోకి విడుదల చేస్తున్న శబ్దాలను రికార్డ్ చేస్తోంది. ఈ ధ్వనులు 20-100 కిలోహెర్ట్జ్ పరిధిలో అల్ట్రాసోనిక్‌గా ఉన్నాయని.. అందువల్ల మనుషులు వినలేకపోతున్నారని అన్నారు. వీరు పరిశోధనను నిర్వహించడానికి.. 5 శాతం కంటే తక్కువ నీరు శాతం ఉన్న నేలను ఎంచుకున్నారు. అక్కడ మొక్కలు చేస్తున్న శబ్దాలను గుర్తించారు. ఈ పరిశోధనలో ఒత్తిడి లేని మొక్కలు కంటే.. ఒత్తిడికి గురైన మొక్కలు ఎక్కువ శబ్దాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి పరిశోధకులు ఏ జాతులు ఏఏ ధ్వనిని ఉత్పత్తి చేశాయో మాత్రమే కాకుండా… అది ఏ రకమైన ఒత్తిడితో ఉందో కూడా గుర్తించగలిగారు. అయితే అన్ని మొక్కల్లో ఈ శబ్దాలను పరిశోధకులు గుర్తించలేకపోయారు. కేవలం కొన్నింటిలో మాత్రమే కనుగొన్నారు. ఇలాంటి పరిశోధనలు భవిష్యత్తులో ఆహార ఉత్పత్తికి సహాయపడతాయా అన్నది ప్రశ్నార్థకం. అయితే శబ్దాల ఆధారంగా మొక్కలను పరిరక్షించుకోవచ్చని.. మరింత ప్రయోగాలు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని శాస్త్రవేత్తులు చెబుతున్నారు.