News

ఆదివాణీ యాప్‌లోకి త్వరలో కోయ భాష

34views

అంతరించిపోతున్న గిరిజన భాషలను సంరక్షించి, వాటికి డిజిటల్ భవిష్యత్తును అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గిరిజన భాషలను ఏఐ సాంకేతికతతో అనువదించేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రూపొందించిన ‘ఆదివాణీ’ ఏఐ అనువాద యాప్‌లో త్వరలో కోయ భాష కూడా అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ఆదివాణీ యాప్‌లో సంతాలీ, భిలీ, ముండారి, గొండి వంటి గిరిజన భాషలకు అనువాద సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా కోయ, గారో భాషలను కూడా యాప్‌లో చేర్చేందుకు భాషా నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సహకారంతో డిజిటలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

62 వేల తెలుగు పదాలతో కోయ భాష డిజిటలైజేషన్‌
ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడే కోయ భాషకు సంబంధించి సుమారు 62 వేల తెలుగు పదాలను సేకరించి, వాటికి కోయ భాషలో సమానార్థక పదాలను రూపొందించే ప్రక్రియ చేపట్టారు. గిరిజన భాషా నిపుణులు, ఉపాధ్యాయులు, అనువాదకులు కలిసి ఈ పనిలో భాగస్వాములవుతున్నారు.

విశాఖపట్నం, కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో సుమారు నెల రోజుల పాటు ఈ ప్రక్రియను నిర్వహించినట్లు కోయ భాషా ఉపాధ్యాయులు తెలిపారు. కోయ భాషలో రూపొందించిన పదాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నమోదు చేసి డిజిటల్ డేటాబేస్‌గా తయారు చేస్తున్నారు.

కోయ భాషకు ప్రత్యేక లిపి అందుబాటులో లేకపోవడంతో తెలుగు పదాల ఆధారంగా కోయ భాషా పదాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘కోయ భారతి’ పేరుతో గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అంతరించిపోతున్న భాషలకు ఆదివాణీ అండ
దేశంలో గిరిజన సమాజాలు మాట్లాడే అనేక భాషలు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా భాషలను డిజిటల్‌ రూపంలో భద్రపరచడం, భవిష్యత్‌ తరాలకు అందించడం అత్యంత కీలకంగా మారింది. ఆదివాణీ యాప్‌ ద్వారా గిరిజన భాషల్లోని పదాలు, మాటలను హిందీ, ఇంగ్లిష్‌ వంటి భాషల్లోకి అనువదించడంతో పాటు ఇతర భాషల కంటెంట్‌ను గిరిజన భాషల్లోకి మార్చే అవకాశం కల్పించనున్నారు.

త్వరలో కోయ భాషలోనూ వినిపించనున్న ఆదివాణీ
కోయ భాషను ఆదివాణీ యాప్‌లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కోయ మాట్లాడే గిరిజనులకు డిజిటల్ ప్రపంచంతో మరింత సులభంగా అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంది. విద్య, ప్రభుత్వ సేవలు, సమాచార మార్పిడి వంటి రంగాల్లో ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

“సుమారు 62 వేల తెలుగు పదాలను కోయ భాషలోకి అనువదించి, కంప్యూటర్‌లో డిజిటైజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆదివాణీ యాప్‌లో కోయ భాష మాటలను వినే అవకాశం ఉంటుంది” అని కేఆర్‌పురం గిరిజన భాష రూపకల్పన ఉపాధ్యాయుడు నూపా నాగేశ్వరరావు తెలిపారు.

అదేవిధంగా “ఆదివాణీ ద్వారా ఎవరు ఏ భాషలో కంటెంట్‌ ఇచ్చినా, కోరుకున్న గిరిజన భాషలోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. కోయ భాషను ఈ యాప్‌లో రూపొందించే అవకాశం రావడం సంతోషంగా ఉంది” అని జీలుగుమిల్లి మండలం కె.పండుగూడెం ఉపాధ్యాయురాలు మడకం పోశమ్మ పేర్కొన్నారు.

కోయ భాషా వలంటీర్‌ కుంజా కన్నపరాజు మాట్లాడుతూ.. గిరిజన భాషలను సంరక్షించేందుకు ఆదివాణీ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుందని, త్వరలోనే కోయ భాష కూడా ఇందులో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

భాష కేవలం సమాచార సాధనం కాదు.. అది ఒక సమాజపు సంస్కృతి, సంప్రదాయం, చరిత్రకు ప్రతీక. కోయ భాషను ఆదివాణీ వంటి ఆధునిక సాంకేతిక వేదికపైకి తీసుకురావడం ద్వారా ఆ భాషను భవిష్యత్ తరాలకు భద్రపరిచే దిశగా కీలక ముందడుగు పడినట్లే.