News

కాశీ విశ్వేశ్వ‌రుడికి ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ ప్ర‌త్యేక పూజ‌లు

154views

కాశీలో స‌త్రం ఓపెనింగ్ సంద‌ర్భంగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ పాల్గొన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ కాశీలో గంగా స్నానం చేసిన త‌ర్వాత తాను పూర్తిగా శాఖాహారిగా మారిన‌ట్లు చెప్పారు. 25 ఏళ్ల క్రితం తాను మాంసాహారం సేవించేవాడిన‌ని, అయితే 25 ఏళ్ల క్రితం కాశీకి వెళ్లాన‌ని, అప్పుడు అక్క‌డి గంగా న‌దిలో స్నానం చేసిన త‌ర్వాత త‌నలో మార్పు వ‌చ్చింద‌ని, ఆ త‌ర్వాత తాను శాఖాహారిగా మారిన‌ట్లు రాధాకృష్ణ‌న్ వెల్ల‌డించారు. శ్రీ కాశీ న‌ట్టుకొట్టై న‌గ‌ర స‌త్రం మేనేజింగ్ సొసైటీ వార‌ణాసిలో కొత్త‌గా నిర్మించిన స‌త్రాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఆ త‌ర్వాత కాశీ విశ్వ‌నాథుడు, అన్నపూర్ణ మాత‌ను ద‌ర్శ‌నం చేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌.. ఉప రాష్ట్ర‌ప‌తిని స‌న్మానించారు.

కాశీ విశ్వేశ్వ‌రుడికి ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ధ‌ర్మానికి తాత్కాలికంగా సంక్షోభ‌వం వ‌స్తుంద‌ని, కానీ అది శాశ్వ‌తం కాదు అని ఆయ‌న అన్నారు. ఈ స‌త్ర‌మే దీనికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 25 ఏళ్ల క్రితం తాను కాశీకి వ‌చ్చిన‌ప్పుడు మాంసాహారం సేవించేవాడిన‌ని, కానీ గంగా న‌దిలో స్నానం చేసిన త‌ర్వాత త‌న జీవితం మారింద‌ని, అప్పుడు శాఖాహారం స్వీక‌రించిన‌ట్లు చెప్పారు. కాశీలో ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌ని, ఆ నాటి కాశీకి, ఇప్పటి కాశీకి చాలా తేడా ఉంద‌న్నారు. ప్ర‌ధాని మోదీ, సీఎం యోగి వ‌ల్లే ఈ మార్పు సాధ్య‌మైంద‌న్నారు. నాగ‌రాతా క‌మ్యూనిటీ చేస్తున్న సేవ‌ల్ని ఆయ‌న కొనియాడారు. త‌మిళ సంస్కృతిని వాళ్లు ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు మెచ్చుకున్నారు. స‌త్రం నిర్మాణం కోసం ఆ కమ్యూనిటీ సుమారు 60 కోట్లు విరాళం ఇచ్చిన‌ట్లు చెప్పారు.

కాశీ త‌మిళ సంఘం ఏర్పాటుతో బంధం మ‌రింత బ‌ల‌మైంద‌ని, త‌మిళ‌నాడు నుంచి కాశీకి వ‌చ్చే యాత్రికుల సౌక‌ర్యార్థం 1863లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశార‌న్నారు. ఇప్ప‌టికీ ఆ స్పూర్తి కొన‌సాగుతోంద‌న్నారు. అన్నపూర్ణాదేవి విగ్ర‌హాన్ని తీసుకురావ‌డం, కాశీ-త‌మిళ సంఘం ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేయ‌డం మోదీ, ఆదిత్య‌నాథ్ వ‌ల్లే జ‌రిగిన‌ట్లు చెప్పారు. కాశీకి మ‌ళ్లీ ఆధ్యాత్మిక పూర్వ వైభ‌వం వ‌చ్చింద‌న్నారు. వార‌ణాసి ఆల‌యం నుంచి వందేళ్ల క్రితం అన్నపూర్ణాదేవి విగ్ర‌హాన్ని చోరీ చేశార‌ని, ఆ విగ్ర‌హాన్ని 2021లో కెన‌డా మ‌ళ్లీ మ‌న‌కు అప్ప‌గించిన‌ట్లు గుర్తు చేశారు.