News

పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది : భారత్

146views

పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ మాటలు, కపటత్వాన్ని బయటపెట్టారు.

కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్థాన్ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ కోసం ఆందోళన చేస్తున్న అమాయక పౌరులను చంపిందని భావిక మనగలనందన్ ఆరోపించారు. తక్షణమే మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని పాకిస్థాన్‌ను కోరుతున్నట్లు డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే ప్రతి అవకాశంలోనూ పాకిస్థాన్ దౌత్యవేత్తలు భారతదేశంపై దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు, అబద్ధాలు వాస్తవాన్ని లేదా సత్యాన్ని మార్చలేవని స్పష్టం చేశారు.

భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికి కాశ్మీర్ ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడమే అని తెలిపారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని.. విడదీయరాని భాగమని స్పష్టం చేశారు. మానవ హక్కులకు భారతదేశం కట్టుబడి ఉందని.. అహింస, సమానత్వం అనేది మహాత్మాగాంధీ స్వాతంత్ర్య పోరాటం నుంచి వచ్చిందని గుర్తుచేశారు.