
విజయనగరం జిల్లా బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయని, అధికార యంత్రాంగమంతా కలిసికట్టుగా దీనికి అడ్డుకట్ట వేయాలని ఆర్డీవో జేవీఎస్ఎస్ రామ్మోహనరావు అన్నారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన జంతు సంక్షేమ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దత్తిరాజేరు మండలం పెద మానాపురంలో పశువుల సంత నిర్వహణకు లైసెన్స్ లేకపోయినప్పటికీ అక్కడ పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దేవాలయాలకు మూడు వందల మీటర్ల పరిధిలో ఎటువంటి జంతు బలులు జరగకుండా చూడాలని సూచించారు. వచ్చే నెల మొదటి వారంలో గొల్లపల్లి దాడితల్లి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్కడ జంతు బలులు నిషేధం అన్న బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొబ్బిలి డీఎస్పీ జి.భవ్య మాట్లాడుతూ పెదమానాపురం సంతకు ఒడిశా, పార్వతీపురం, పి.కోనవలస మీదుగా పశువుల అక్రమ రవాణా జరగకుండా తగిన నిఘా పెడతామని తెలిపారు.
ఏపీ గోసంరక్షణ సమాఖ్య అధ్యక్షుడు లోగిశ రామ కృష్ణ మాట్లాడుతూ బొబ్బిలి డివిజన్లో పశువుల అక్రమ రవాణా చాలా జోరుగా జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిని అడ్డుకుని, రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేయాలన్నారు. గో సంర క్షణా శాలల ఏర్పాటు కోసం స్థలాలను కేటాయించాలని కోరారు. అనంతరం గోమాత గోసంరక్షణ సంస్థ రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి పశు సంవర్థక శాఖ డీడీ ఎల్.విష్ణు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లావణ్య, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరు ఉప్పాడ సోమేశ్వరరావు, మండల పరిషత్ ఏవో ఆర్వీఏ రావు, దత్తిరాజేరు మండల పంచాయతీ విస్తరణాధికారి వాణిశ్రీ, గోసంరక్షణ ప్రతినిధులు కేవీఆర్ సత్యనారాయణ, చింతల పూడి భూపతి, వి.ఝాన్సీ పాల్గొన్నారు.




