News

సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లా రాయబారికి ఇండియా సమన్లు

358views

ఢాకా-న్యూఢిల్లీ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై చర్చించేందుకు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌ నూరల్ ఇస్లాం (Nural Islam)కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారంనాడు సమన్లు పంపింది. దీంతో నూరల్ ఇస్లాం సౌత్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లారు. సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అదివారంనాడు సమన్లు పంపిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

ప్రణయ్ వర్మ ఆదివారంనాడు సమన్లు అందుకోగానే బంగ్లా విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి విదేశాంగ శాఖ కార్యదర్శి జషిమ్ ఉద్దీన్‌తో 45 నిమిషలు మాట్లాడారు. ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, ఇండో-బంగ్లా సరిహద్దులు వెంబడి 5 చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని ఢాకా ఆరోపిస్తోంది.

కాగా, దీనిపై ప్రణయ్ వర్మ మీడియాకు వివరణ ఇస్తూ, భద్రతా పరంగా సరిహద్దుల వెంబడి కంచె విషయంలో ఢాకా-న్యూఢిల్లీ మధ్య అవగాహన ఉందన్నారు. దీనిపై ఇరుదేశాల సరిహద్దు కాపలా సంస్థ బీఎస్ఎఫ్, బీజీబీ (బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన అవగాహనల అమలు, సరిహద్దుల వెంబడి నేరాలపై పోరాటానికి పరస్పర సహకార విధానం పాటిస్తారని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు.