విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. మొత్తం 25 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా గతంలో చర్చ జరిగిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి మరింత ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అమ్మవారి ఆలయం తరఫున కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లకు గత అనుభవం ఉందా? లేదా? అనేది పరిశీలించిన తర్వాతే కాంట్రాక్ట్ ఇస్తామన్నారు.
దసరా ఏర్పాట్ల పరిశీలన కోసం పాలకమండలి సభ్యులను నియమించనున్నట్లు బొర్రా గాంధీ తెలిపారు. విద్యుత్, క్యూ లైన్లు, పెయింటింగ్ ప్రతిదీ పరిశీలిస్తామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామన్నారు. ఈసారి పోలీసులు తక్కువగా ఉండే విధంగా చూస్తామని తెలిపారు. ఈఏడాది ఆర్జిత సేవలను కొత్తగా నిర్మాణం చేసుకున్న భవనంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు.
పూర్తి టెక్నాలజీతో దసరా ఉత్సవాలు: ఈవో
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని ఈవో శీనానాయక్ అన్నారు. పోలీసులు చాలా తక్కువగా ఉండేలా చూస్తామని.. పూర్తి టెక్నాలజీతో ఉత్సవాలు జరుగనున్నట్లు వెల్లడించారు. దసరా ఉత్సవాలకు ఇంకా 25 రోజులు సమయం ఉందని.. చర్చ జరగాల్సిన అంశాలు ఉన్నాయన్నారు. సామాన్య భక్తులకు కూడా అంతరాలయ దర్శనం ఉండబోతుందని.. టికెట్ ఎంత అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు.