ArticlesGallery

శ్రీవారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలు – వీటి పేర్లు, కొలతలు తెలుసా?

4views

( తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేకం )

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి పుష్పాలంకార ప్రియుడు. శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనదని. పవిత్రమైన కార్యమని ”తిరువాయ్‌ మొళి” అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడా పేర్కొన్నారు. స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఈ పుష్పహారాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.⁠ ⁠శిఖామణి: కిరీటం మీదనుంచి రెండు భుజాల మీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను ‘శిఖామణి’ అంటారు. ఇది ఎనిమిది మూరల దండ.

2.⁠ ⁠సాలిగ్రామ మాల: శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూవున్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండుమాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు.

3.⁠ ⁠కంఠసరి: శ్రీవారి మెడలో రెండు భుజాల మీదికి అలంకరించే దండ ఒకటి మూడున్నర మూరలు.

4.⁠ ⁠వక్షస్థల లక్ష్మీ: శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండుదండలు, ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.

5.⁠ ⁠శంఖుచక్రం: శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర.

6.⁠ ⁠కఠారిసరం: శ్రీస్వామివారి బొడ్డునవున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి. రెండు మూరలు.

7.⁠ ⁠తావళములు: రెండు మోచేతులకింద, నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు. అందులో మొదటిది మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు.

8.⁠ ⁠తిరువడి దండలు: స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర.

ప్రతి గురువారం జరిగే ”పూలంగి సేవ”లో మాత్రమే శ్రీస్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.

ఇంకా శ్రీస్వామివారి నిత్యకల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకుగాను ప్రత్యేకంగా పూలమాలలు కూర్చుతారు. స్వామివారికి అలంకరించే మాలలకు తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం (తామర), కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపుచెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం (మారేడు) ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలు వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్పకైంకర్యంలో వినియోగిస్తారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా శ్రీస్వామివారికి జరిగే తోమాలసేవ (పుష్ప కైంకర్యం)కు ఈ పుష్పఅర నుంచి సిద్ధం చేసిన పూలమాలలను, జియ్యంగార్లు తలపై పెట్టుకొని బాజాభజంత్రీలతో ఛత్రచామర మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు.