News

12 ఏళ్ల బాలుడి యజ్ఞోపవీతాన్ని తెంపేసిన దుండగులు

35views

తమిళనాడులోని త్యాగరాజ నగర్ లో ఘోరం జరిగింది. అఖిలేష్ (12) అనే బ్రాహ్మణ యువకుడి యజ్ఞోపవీతాన్ని తెంపేసి, బాలుడ్ని బెదిరించి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. మూడు రోజుల క్రితం ఈ బాలుడు ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా… నలుగురు దుండగులు ఈ నీచమైన పనికి ఒడిగట్టారు. మొదట ఈ విషయం తల్లిదండ్రులు ఈవెంట్ నిర్వాహకులకు తెలియజేశారు. ఆ తర్వాత పెరుమాళ్పురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. సనాతన సంప్రదాయం నచ్చని వారే ఇలాంటి పనులు చేశారని తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

అయితే… ఈ బ్రాహ్మణ బాలుడు కల్పించిన కథ అని పోలీసులు ప్రకటన విడుదల చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. 12 ఏళ్ల యువకుడు కూడా కల్పిత కథలు సృష్టించగలడా? అంటూ హిందువులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి మురుగన్ కూడా స్పందించారు. తమిళనాడులో శాంతిభద్రతలు సరిగ్గా లేవని, దుండగులను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. సామాజికంగా ఇలాంటి ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తాయన్నారు.

మరోవైపు తమిళనాడు బ్రాహ్మణ సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే చర్యలు తీసుకోవాలని, జోక్య చేసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలేష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. యజ్ఞోపవీతం బ్రాహ్మణులతో పాటు చెట్టియార్లు, ఆర్యవైశ్యులకు కూడా వుంటుందన్నారు. ఈ దాడి బ్రాహ్మణులపై జరిగిన దాడితో పాటు హిందుత్వంపై జరిగిన దాడి అని బ్రాహ్మణ సంఘం పేర్కొంది.