News

నేటి నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు

47views

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 17 నుంచి 20వతేదీ(శని, ఆది, సోమ, మంగళ) వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో దేవస్థానంలో అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేశారు. ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి కార్యక్ర మంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీ వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించి అనంతరం స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి అలంకారం చేశాక శాస్ర్తోక్తంగా వేదమంత్రాల మధ్య పవిత్రమాలలను ధరింపజేస్తారు. 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సర్వ ప్రాయశ్చిత విధి, వివిధ దేవతారాధనలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి మూల మంత్రహవనాలు, వేద పారాయణలు, హారతి, మంత్రపుష్పం సమర్పిస్తారు. 19వ తేదీన మండ పారాధన నిర్వహిస్తారు. 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మండపా రాధన, సర్వప్రాయశ్చిత విధి, శాంతి పౌష్టిక హోమాలు, కూష్మాండ బలి నిర్వహించాక 10.30 గంటలకు కలశోద్వాసన, మార్జనం, మహదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 18వ తేదీన స్నపనాభిషేక కార్యక్రమం సందర్భంగా ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు.