ArticlesNews

వరాలతల్లీ…! వందనం

36views

( ఆగస్ట్‌ 16 – వరలక్ష్మీ వ్రతం )

శ్రీమహావిష్ణువులానే శ్రీమహాలక్ష్మీదేవి సర్వవ్యాపితమై లోకజననిగా పేరు పొందింది. ‘సంసార సాగరంలో మునిగిపోయే వారు నన్ను పొందేందుకు లక్ష్మీదేవిని కటాక్ష రూపిణిగా మహర్షులు నిర్ణయించారు. అది నాకూ సమ్మతమే’ అని స్కంద పురాణంలో విష్ణు వాక్యంగా చెబుతారు. ధనం అంటే కేవలం సంపదే కాదు. మానవ మనుగడలో భాగమైన ఆరోగ్యం, ఆయుస్సు, విద్య, వివేకం,సౌభాగ్యం, ధైర్యం, స్థైయిర్యం, అభయం, విజయం తదితరాలు కూడా. వీటన్నిటికి అధిదేవత శ్రీమహాలక్ష్మిని అర్చిస్తే సర్వం సమకూరు తాయంటారు. సదాచార పరాయణత, స్త్రీలు మన్ననలు అందుకునే చోటు, కన్నవారిని గౌరవిస్తూ, బంధుప్రీతి, శుచీశుభ్రత, తులసీ తదితర మంగళకర వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, సర్వదేవతలను అర్చించే స్వరం, ఆనందం, ఉత్సాహం, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలన వంటి లక్షణాలు కల ప్రదేశాలు అమ్మవారి ఆవాసాలట.

సమస్త సంపదలకు మూలం అదిలక్ష్మి అని, ఆమె కృపాకటాక్షాలతోనే మానవ మనుగడ సాగుతోందని, ఆ దేవి దయ ఉంటే సంపదలు సమకూరుతాయని ఆధ్యాత్మికవేత్తల భావన, విశ్వాసం. ఆమె ప్రాణనాథుడు శ్రీమన్నారాయుణుడి జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో అర్చించడం మరింత విశేషమని చెబుతారు. లక్ష్మీనారాయణులది అవినాభావ సంబంధం. అమ్మవారు వాక్కు అయితే, ఆయన భావం. అమె సంతోషం అయితే, ఆయన సంతృప్తి, ఆమె కాంతి అయితే, ఆయన చంద్రుడు. ఆమె ధర్మపరత్వమైతే ఆయన ధర్మం. ఆ ఆదిదంపతుల అర్చనం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది. వైకుంఠ వాకిలి మోక్షద్వారం. అక్కడ అమ్మవారు ‘మోక్షలక్ష్మి’గా కొలువై ఉంటారని పెద్దలు చెబుతారు. ఆమె స్థితి కారకురాలు. ఆ తల్లి కరుణాకటాక్షాల కోసం తపించని వారు ఉండరు. మానవ జీవితంలో ఆనందమయ ప్రతి క్షణం లక్ష్మీకటాక్షమే. ఆమె ఐశ్యర్యానికి అధిష్ఠాన దేవత అయినా.. కేవలం ధన రూపంలోనే ఉండదు. సంపదగల వారంతా సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నారా? అని ప్రశ్నించుకుంటే లక్షీ‘కటాక్షం’ తత్త్వం అర్థమవు తుంది. అంతటి మహిమాన్విత తల్లిని సౌమాంగల్యం, సత్సంతానాభివృద్ధి కోసం, ప్రధానంగా శ్రావణ మాసంలో వరలక్ష్మిగా ఆరాధిస్తారు.

వైవాహిక జీవితం సవ్యంగా సాగాలని వివాహితలు, దీర్ఘ సౌభాగ్యం కోసం కొత్తగా పెళ్లయిన వారు, ఉత్తమ జీవిత భాగస్వాముల కోసం అవివాహితలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సౌభాగ్యం, సత్సంతానం ద్వారా వంశాభివృద్ధిని ప్రతి మహిళ అభిలషిస్తుందనేందుకు ఈ వ్రతాన్ని ప్రత్యక్ష నిదర్శనంగా చెబుతారు.ఆషాఢంలో పుట్టినింట ఉండే నవవధువులు శ్రావణం ప్రవేశించాక, మొదటి మంగళవారం నోము జరుపుకుని మెట్టినింటికి చేరి వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళీయోగం, అష్టైశ్వరాలు లభిస్తాయని విశ్వసిస్తారు. వివాహితలు శ్రావణం లోని శుక్రవారాలు లక్ష్మీపూజ, పెళ్లికాని యువతులు మంగళ వారాలు మంగళగౌరి వ్రతం ఆచరించడం సంప్రదాయం.

గృహిణ సలక్షణాలను వర్ణిస్తూ ‘రూపేచ లక్ష్మీ’ అన్నారు. అంటే సర్వాభరణ భూషితురాలని అర్థం కాదు. నవ్వు ముఖం, సౌమ్యత, ఆదరణ, ప్రేమాభి మానాలతో కూడిన పలకరింపు ఉత్తమ లక్షణాలని, లక్ష్మీదేవి ఆరాధనతోనే అవి సంక్రమిస్తాయన్నది పెద్దల మాట. లక్ష్మీదేవికి స్థిరత్వం ఉండదని, చంచల, చపలచిత్త.. అని లోకంలో వ్యాఖ్యానాలు ఉన్నాయి కాని అందుకు కారణాల గురించి మాత్రం యోచన చేయరు. సంపద (లక్ష్మి) రాకపోకల గురించి ప్రచారంలో ఉన్న పౌరాణిక గాథ ప్రకారం, ఇంద్రుడు అహంకరించి, విష్ణుప్రసాదాన్ని ధిక్కరించి, ఆ తర్వాత పశ్చాత్తాపంతో హరిని చేరగా, ‘విష్ణు`గోసేవలు, దైవారాధన, ధర్మనిష్ఠ, సత్య భాషణం, సదాచారం, శుచీశుభ్రత, ప్రేమానురాగాలు గల లోగిళ్లే లక్ష్మీ నివాసాలు. పరుష సంభాషకులు, సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో నిద్రించేవారి, చిరిగిన దుస్తులు ధరించే వారి ఇంట లక్ష్మి క్షణమైనా ఉండదు’ అని చెప్పాడట. ఏనుగులతో అభిషేకం అందుకుంటున్న శ్రీమహాలక్ష్మిని ఉదయం నిద్రలేవగానే స్మరించడం వల్ల ఆరోగ్యానికి, ఇంటికి లోటు ఉండదని శంకర భగవత్పాదులు పేర్కొన్నారు.