కేరళలోని వయనాడ్లో సంభవించిన ప్రకృతి విపత్తు అత్యంత విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ విపత్తు సమయంలో ప్రజలను కాపాడడానికి, విపత్తు నుంచి బయటపడేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆరెస్సెస్ కార్యకర్తలు, సేవా భారతి నిర్విరామంగా సేవలు చేస్తూనే వున్నారు. ఈ సేవలందించే సమయంలో ఓ విషాదం జరిగింది. రెస్క్యూ సమయంలో ఇద్దరు ఆరెస్సెస్ కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఒకటో ల్యాండ్ స్లైడ్ సంభవించిన తరువాత ప్రజలను కాపాడడానికి ఆరెస్సెస్ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లల్ని కాపాడారు.
ఇంకా ఎవరైనా పిల్లలు ఇరుక్కుపోయారా? అని చూస్తుండగా… రెండో ల్యాండ్ స్లైడ్ కూడా సంభవించింది. దీంతోనే ఆరెస్సెస్ కార్యకర్తలైన ప్రజీష్, శరత్ తమ ప్రాణాలను కోల్పోయారు. వీరి కోసం వెతుకుతున్న క్రమంలో 500 మీటర్ల దూరంలో ప్రజీష్ అనే స్వయంసేవక్ మృతదేహం లభించింది. శరత్ అనే స్వయంసేవక్ మృతదేహం కోసం ఇంకా వెతుకుతూనే వున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి శతథా ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరు స్వయంసేవకులు తమ ప్రాణాలను బలిదానం చేశారు. తాము పాడుతున్న గీత్లను గానీ, ప్రార్థనను కానీ శతవిధాలా నిజ జీవితంలో ఆచరణలోకి పెట్టారు.