News

పంచ పరివర్తన్ తో సమాజంలో చక్కని మార్పులు తధ్యం

59views

* శ్రీ సరస్వతి విద్యాపీఠం వర్షారంభ సమావేశాలు
సమాజంలో బలమైన పురోగతి సాధించాలి అంటే పంచ పరివర్తన్ ను అమలు చేయాలని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం సమాజంలోని పౌరులంతా ఈ ఐదు అంశాలు అర్థం చేసుకోవాలని, ఇటువంటి మార్పు దిశగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు
చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.

1. సామాజిక సమరసత
సమాజంలోని వారందరూ భరతమాత బిడ్డలే. కుల, వర్గ ప్రాతిపదికన విడిపోకుండా అందరం కలసి ఒకరినొకరిని గౌరవించుకుంటూ జీవించాలి. సమాజంలోని అందరూ సమానమే అనే భావనతో జీవించాలి.

2. కుటుంబ ప్రబోధన్
మన పిల్లలకు విలువైన జీవన విలువలను ఇవ్వడంలేదు. జీవన విలువలను పాఠశాల, కుటుంబాలద్వారా మన పిల్లలకు అందించడంవలన భావి తరాలను మంచి మార్గంలో నడిపించగలుగుతాం.

3. పర్యావరణ పరిరక్షణ
హిందువులు ప్రకృతి ఆధారంగా జీవిస్తుంటాం.‌ నీరు, అడవులు (మొక్కలు), పచ్చదనం కాపాడుకోవాలి. ప్లాస్టిక్ వాడకం ఆపేయాలి.

4. మన భాష -వేషధారణ
మనదైన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. మాతృభాషను, మాతృదేశాన్ని గౌరవించాలి.

5. పౌరనియమాలు
ఒక పౌరుడిగా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఒకరు చూస్తున్నారనో లేదా చూడడం లేదనో మనం ప్రవర్తించ కూడదు.

ఈ ఐదు నియమాలను అమలు చేయడం శిశుమందిర్ వ్యవస్థల నుంచి మొదలు పెడదామని లింగం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రతి ఏటా వర్షారంభ సమావేశాలు నిర్వహిస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల ప్రధాన ఆచార్యులు, పాఠశాల కమిటీ నాయకులు, శైక్షణిక్ ప్రముఖ్ లు పాల్గొంటారు.

ఈ విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాల మీద యోజన చేయడం జరుగుతుంది. ఈ ఏడాది వర్షారంభ సమావేశాలు హైదరాబాద్ శారదా ధామంలో మూడు రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యా భారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు సందేశాత్మకంగా ప్రసంగించారు.

సమావేశాల్లో తీసుకున్న యోజన కు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని సూచించారు. కార్యకర్తలు కార్యశీలకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు, కోశాధికారి పసర్తి మల్లయ్య, ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ మార్గదర్శనం చేశారు.

శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతిరావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు సమావేశాలను నిర్వహించారు. ఈ ఏడాది విద్యాపీఠంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ముఖ్యంగా ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధనను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకోసం సబ్జెక్టుల వారీగా నిపుణులను పిలిపించి ప్రశిక్షణ ఇప్పించారు. పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాత్మక అంశాలు పెంచాలని, ఇందుకు అనుగుణంగా చొరవ తీసుకోవాలని భావిస్తున్నారు.