GalleryNews

సప్తపది ఆలయాన్ని నిర్మిస్తున్న ముస్లింలు

63views

హిందువుల దేవుళ్ళను కొలిచే కొంతమంది ముస్లింలు ఉన్నారు. తాజాగా అందుకు ఉదాహరణకు నిలుస్తుంది ఓ ముస్లిం కుటుంబం. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ముస్లిం ఫ్యామిలీలోని అన్నదమ్ములు తమ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆంజనేయ స్వామి సహా పలువురి దేవుళ్ల ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం చేపట్టిన ఆలయ నిర్మాణ కార్యక్రమం నేటికీ కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని పులిచెర్ల మండలం కె.కొత్తపేట గ్రామానికి చెందిన ఫిరోజ్, చాంద్ భాషా అన్నదమ్ములు తమ తండ్రి అజీద్ బాషా కోరిక తీర్చాలని భావించారు. తండ్రి కోరిక మేరకు ఆంజనేయస్వామి సహా సప్తపది ఆలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇలా తాము హనుమంతుడిని పూజించడానికి కూడా ఒక కారణం ఉందని చెబుతున్నారు ఈ అన్నదమ్ములు. తమ తాతయ్యకు ఎంత కాలం అయినా సంతానం లేదని.. అప్పుడు ఓ స్వామీజీ హనుమంతుడిని పూజించమని సలహా ఇచ్చాడని.. ఆ పూజలకు ఫలితమే తమ తండ్రి అజీద్ బాషా జననం అని చెబుతున్నారు. తన తండ్రికి ఆంజనేయస్వామి అంటే ఇష్టమని పేర్కొన్నారు. అందుకనే తాము ఈ ఆలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు ఫిరోజ్, చాంద్ భాషా.

2010లో సప్తపది ఆలయ నిర్మాణం చేపట్టినట్లు.. ఈ ఆలయ ప్రాంగణంలో ఏడుగురు దేవతామూర్తులను ప్రతిష్టంచనున్నామని తెలిపారు. ఈ ఆలయాన్ని తమ సొంత డబ్బులతోనే నిర్మిస్తున్నామని.. చెప్పారు. ప్రస్తుతం ఈ ఆలయంలో హనుమంతుడు, వినాయకుడు, శివుడు ప్రతిష్టించినట్లు చెబుతున్నారు. తమ ఆర్ధిక శక్తికి మించి ఖర్చు చేస్తూ నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి దాతల సహాయం అర్దిస్తున్నట్లు.. ఎవరినా ముందుకు వచ్చి సహకరిస్తే త్వరలో సప్త పది ఆలయాన్ని పూర్తి చేస్తామని ఫిరోజ్, చాంద్ భాషా చెబుతున్నారు.