News

కశ్మీర్‌లో వాయుసేన హెలికాప్టర్ల అత్యవసర ల్యాండింగ్‌ విన్యాసం

198views

అత్యవసర ల్యాండింగ్‌ కసరత్తులో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన ఐదు హెలికాప్టర్లు మంగళవారం జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై దిగాయి. తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో ఈ విన్యాసం జరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి కసరత్తు చేపట్టడం ఇదే మొదటిసారి. దీంతో అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యాన్ని (ఈఎల్‌ఎఫ్‌) అందుబాటులోకి తెచ్చిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ గుర్తింపు పొందింది. ఇలాంటి సౌకర్యం ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. తాజాగా జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై దిగిన హెలికాప్టర్లలో.. అమెరికా తయారీ చినూక్‌, రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎంఐ-17, దేశీయ అడ్వాన్స్‌ లైట్‌ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌) ఉన్నాయి. ఇవి వాన్పో-సంగం ప్రాంతంలో ల్యాండ్‌ అయ్యాయి. ఈ విన్యాసంలో భాగంగా నేల మీద వేచిఉన్న బలగాలను అవి తరలించుకెళ్లాయి.