News

భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన మోటోజీపీ.. విమర్శలతో వెనక్కు తగ్గిన అంతర్జాతీయ సంస్థ

65views

భారత్‌లో తొలిసారిగా జరుగుతోన్న అంతర్జాతీయ మోటార్‌ బైక్‌ రేసింగ్‌ మోటోజీపీ (MotoGP) కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా ప్రదర్శించిన వీడియోలో భారత దేశ పటాన్ని మోటోజీపీ తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది.

కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్‌లు లేకుండా మ్యాప్‌ను ప్రదర్శించడంపై భారతీయ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మోటోజీపీ క్షమాపణలు కోరింది. ఈ మేరకు మోటోజీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది.

”మోటోజీపీ వీడియో ప్రసారంలో భారత పటాన్ని తప్పుగా చూపించినందుకు భారతీయ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాం. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలనే ఉద్దేశం మాకు లేదు. మా మద్దతు ఎప్పుడూ భారత్‌కు ఉంటుంది. భారత్‌లోని బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో తొలిసారిగా జరుగుతున్న ఇండియన్‌ ఆయిల్‌ భారత్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ను మీతో కలిసి ఆస్వాదిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం” అని ట్వీట్‌లో పేర్కొంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ లో సెప్టెంబరు 22- 24 వరకు మూడు రోజులపాటు మోటోజీపీ రేసింగ్‌ జరగనుంది. ఇందులో బైక్‌ రేసర్లు గంటకు 300 కి.మీ వేగంతో బైక్‌లను నడుపుతారు. మూడో రోజు వార్మప్‌ రేస్‌, ఫైనల్‌ రేస్‌ జరుగుతుంది.