
గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ మంగళవారం 5 రాష్ట్రాల్లోని 72 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఫిలిబిత్ కేంద్రంగా అక్రమంగా ఆయుధాలను గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులకు సరఫరా చేస్తున్నారని ఎన్ఐఏ సోదాల్లో తేలింది. అక్రమ ఆయుధాలు పాకిస్థాన్ దేశం నుంచి వచ్చాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానాలకు చెందిన ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకొని వారిని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పాకిస్థాన్ ఐఎస్ఐ, గ్యాంగ్స్టర్లకు మధ్య సంబంధాలున్నాయని ఎన్ఐఏ నాలుగు విడతలుగా జరిపిన దాడుల్లో వెల్లడైంది. గ్యాంగ్స్టర్ల నుంచి అక్రమ ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులు డ్రగ్ ట్రాఫికర్లకు మధ్య సంబంధాలున్నాయని గత ఏడాది అక్టోబరులో ఎన్ఐఏ జరిపిన దాడుల్లో వెలుగుచూసింది.