
మరికొన్ని రోజుల్లో మకర సంక్రాంతి పండుగ రానుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను మకర సంక్రాంతి, పొంగల్ పేరిట జరుపుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. అంతేకాదు హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. మరి ఈ పండుగ వేళ పాటించాల్సిన సంప్రదాయాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా…
భోగి మంటలతో ప్రారంభం..
హిందూ మత గ్రంథాల ప్రకారం, మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి భోగి మంటలను వేయడం ద్వారా పండుగ ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం, భోగి పండుగ రోజునే బదీర వనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్లు(రేగు పళ్లు)తో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్లుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు, భోగి పళ్లు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు.
మకర సంక్రాంతి..
జ్యోతిష్యశాస్త్రం, తెలుగు పంచాంగం ప్రకారం, సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు.
పురాణాల ప్రకారం, మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భువిపైకి తీసుకొస్తాడు. ఈరోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భువిపైకి వస్తుంది. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
జోరుగా కోడి పందేలు.. పతంగుల పండుగ..
ఈ మూడు రోజులపాటు కోనసీమలో కోడి పందేలా జోరు కొనసాగుతుంది. కేవలం కోడి పందేలు మాత్రమే కాదు.. ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తే.. ప్రకాశంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందేలను నిర్వహిస్తారు. ఈ పందేలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్ లో ఈ గాలి పటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
సంతోషకరంగా సంక్రాంతి..
మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈరోజున తమ పశువులను అందంగా అలంకరించి, వాటికి ఇష్టమైన దాణా పెడతారు. నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తింటారు. ఇలా నాలుగురోజులపాటు పండుగ సంబురమంతా పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది.