
తీహార్: మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు అక్కడ లభిస్తున్న సకల సదుపాయాల గురించి రోజుకొక కథనం వెలుగులోకి వస్తున్నది. తాజాగా జైలు అధికారి కలిసిన వీడియోను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శనివారం విడుదల చేసింది. ఈ వీడియోలో మంత్రి తోటి ఖైదీలు, జైలు అధికారితో దర్బార్ నిర్వహించడం సంచలనం రేపింది.
జైలులో ఖైదీతో మసాజ్ చేయించుకోవడం, బయటి నుంచి విలాసవంతమైన భోజనం తెప్పించుకొని తిన్న వీడియోల అనంతరం బీజేపీ తాజాగా సత్యేందర్ కా దర్బార్ అంటూ బీజేపీ జైలు వీడియోను విడుదల చేసింది. జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ ను రాత్రి ఎనిమిది గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్ పరామర్శించారని బిజెపి వెల్లడించింది.
బీజేపీ విడుదల చేసిన కొత్త వీడియోలో సత్యేందర్ జైన్ సెల్లోని పలువురు ఖైదీలతో కలిసి మాట్లాడుతున్నపుడు సూపరింటెండెంట్ జైలు గదిలోకి ప్రవేశించారు. సందర్శన ఫుటేజీ సెప్టెంబర్ నాటిది. మంత్రి జైన్కు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు జైలు అధికారి అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు.
‘‘తీహార్కి సంబంధించిన మరో వీడియోను మీడియా బయటపెట్టింది. ఈసారి సత్యేందర్ కా దర్బార్ జైలు సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారు’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జై హింద్ ట్వీట్లో తెలిపారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు జైలులో ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు లీక్ అయిన వీడియోలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేందర్ జైన్కు తీహార్ జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో ఆరోపించింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఆధారాలను ఆర్థిక దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది.
Source: Nijamtoday