
న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశంలోని బానిసత్వ ప్రతీకల నుంచి విముక్తి చేసి ఆధునిక భారతాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అందులో భాగంగానే రూ.477 కోట్లతో పునర్నిర్మించిన రాజ్పథ్ను కర్తవ్యపథ్గా పేరు మార్చుతున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీలోని ఇండియాగేట్ నుంచి రాష్ట్రపతిభవన్ వరకు ఉన్న రాజ్పథ్ (కింగ్స్ వే) బ్రిటిష్ రాజరికాన్ని మాత్రమే కాక మన బానిసత్వాన్ని గుర్తు చేసేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన నూతనంగా రూపొందించిన కర్తవ్యపథ్ను ప్రారంభించడంతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 28 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇదొక చరిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణిస్తూ గతంలో నేతాజీ విగ్రహం ఉన్న స్థానంలో బ్రిటిష్ చక్రవర్తి అయిదో జార్జి విగ్రహం ఉండేదని గుర్తు చేశారు. ‘‘గతాన్ని, వలసవాద శకలాలను తొలగించాం. కొత్త చరిత్ర ప్రవేశించింది. కర్తవ్యపథ్లో ఆధునిక భారత భవిష్యత్ రూపురేఖల్ని మీరు చూస్తారు. ఇది దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకే కాక, రాజకీయ నాయకులకు, మంత్రులకు, అధికారులకు కర్తవ్యబోధను చేస్తుంది’’ అని మోదీ తెలిపారు.
Source: Nijamtoday