
-
ఆఫ్రికాలో గణనీయంగా తగ్గుదల
-
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
ఐక్యరాజ్యసమితి: యూరప్లో కరోనా ఉద్ధృతి మళ్ళీ పెరుగుతోంది. గతవారం 11 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం అధికంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల మంది కరోనా బారిన పడి మృతి చెందనున్నట్టు డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లజ్ తెలిపారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియంలు తాజాగా లాక్డౌన్లను కూడా విధించాయి.
జర్మనీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. లక్ష మరణాల మార్క్ను ఆ దేశం ఈ వారం దాటనుంది. కరోనా టీకా వేసుకోవాలని అక్కడి రాజకీయ నాయకులు పిలుపునిస్తున్నారు. అటు.. యూరప్లో ఇప్పటివరకు 100 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. చెక్ రిపబ్లిక్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 26 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
వైరస్ వ్యాప్తి పెరగగా.. టీకా తప్పకుండా వేసుకోవాలని పౌరులకు ప్రభుత్వం సూచిస్తోంది. తాజా పరిణామాలతో వైరస్ను కట్టడి చేసే ప్రణాళికను ప్రభుత్వం త్వరలో విడుదలచేయనుంది. అయితే.. కరోనా వ్యాప్తి ఆఫ్రికాలో గణనీయమైన స్థాయిలో తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మరణాలు 30 శాతం తగ్గాయని పేర్కొంది. అమెరికాలో కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కానీ మరణాలు 19 శాతం పెరిగాయని వెల్లడించింది.