
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) అధికార పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశ సరిహద్దుల వెంట రక్షణ విధులు నిర్వహించే ఈ దళం ఇకపై పంజాబ్, పశ్చిమబెంగాల్, అసొం రాష్ట్రాలలో 50 కి.మీ.వరకు లోపలకు వచ్చి సోదాలు, జప్తులు చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయవచ్చు.
ఈ మూడు రాష్ట్రాలలో ఈ పరిధి ఇప్పటి వరకూ 15 కి.మీ. వరకే ఉండేది. బీఎస్ఎఫ్ చట్టంలో 2014 జులైలో పొందుపరిచిన నిబంధనలకు కేంద్ర హోంశాఖ ఈ మేరకు సవరణలు చేసింది. పాకిస్థాన్తో సరిహద్దులు కలిగిన గుజరాత్లో బీఎస్ఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించే ప్రాంత పరిధిని 80 కి.మీ. నుంచి 50 కి.మీ.దూరానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రాజస్థాన్లో మాత్రం 50 కి.మీ. పరిధిని యథాతథంగానే ఉంచింది. పంజాబ్, రాజస్థాన్లు కూడా పాకిస్థాన్తో సరిహద్దులను కలిగి ఉన్నాయి. అసొం మాత్రం బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది.
బంగ్లాదేశ్, పాకిస్థాన్లతో మనదేశానికున్న సరిహద్దుల వెంట 6,300 శిబిరాల వద్ద 2.65 లక్షల మంది బీఎస్ఎఫ్ జవాన్లు విధులు నిర్వహిస్తున్నారు. తాజా సవరణ వల్ల సరిహద్దు వెంట జరిగే నేరాలను మరింత సమర్థంగా నిలువరించడానికి వీలవుతుందని బీఎస్ఎఫ్ అధికారులు అభిప్రాయపడ్డారు. సరిహద్దు రాష్ట్రాలన్నిటిలోనూ ఏకరూప విధానం అమలులోకి వస్తుందని తెలిపారు.





