
కొవిడ్ చికిత్సలో అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ చికిత్సా ఔషధాలు సహా పలు రకాల మందులపై పన్ను రేట్లను తగ్గించేలా జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి పలు రకాల వస్తువులు, ఔషధాలపై పన్ను రేట్లను తగ్గించింది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, కొవిడ్ పరీక్షా కిట్లు, మాస్కులపై పన్నును 12 శాతం నుంచి 5శాతానికి తగ్గించింది. హాండ్ శానిటైజర్లపై పన్నును 18 నుంచి 5శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. కరోనా అత్యవసర చికిత్సలో వినినియోగించే రెమ్డెసివిర్ ఇంజక్షన్పై పన్నును 12శాతం నుంచి 5శాతానికి తగ్గించింది. అయితే.. వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఆంఫోటెరిసినియన్-బీ వంటి ఔషధాలపై ఎలాంటి పన్ను విధించరాదని మండలి నిర్ణయించింది. ఈ తగ్గింపు 2021 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.





