
లద్దాఖ్ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి భారత్, చైనా మధ్య చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘సరిహద్దుల వెంట చొరబాట్లు, దురాక్రమణలను నివారించేందుకు ప్రభుత్వం శాంతియుత మార్గాలను అన్వేషిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించనప్పుడు.. సైనిక చర్యకు రక్షణ సేనలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి’ అని రావత్ పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపారు. సరిహద్దుల వద్ద పూర్వపు పరిస్థితులను తీసుకురావడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు లద్దాఖ్ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదంపై సుమారు రెండు నెలలుగా భారత్, చైనా మధ్య అనేక మార్లు చర్చలు జరిగినప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు మాత్రం రాలేదు.





